Monday, November 1, 2010

నేల తల్లి నీల్లోసుకున్నాది

భూమి: అమ్మా ...అమ్మా...నేను వనజక్క వాళ్ళింటికి వెళ్తున్నా ...
లచ్చమ్మ: అవునే భూమీ మర్చిపోయినా..ఈ రోజు దాని సీమంతం కందా
సావిత్రమ్మ: మన భూమి తల్లికే ఇంకా సీమంతం ముచ్చట లేదాయె
అంజయ్య: నువ్వూరుకోయే అమ్మా ...అది పట్నం నుంచి నిన్ననే వచ్చినాది...నువట్టా అంటుంటే రేపే ఎల్లి పోతుంది ..
అమ్మా బుజ్జమ్మా నువ్వు తొందరగెల్లి తొందరగొచ్చేయ్. అవునూ, ఏందదీ, ముఖానికీ, గొల్లకీ రంగులేసినా? మొన్న మొన్నటి వరకూ పొలంలోని పసుపూ, పెరట్లోని గోరింటాకుతో లచ్చిందేవిలాగ ఉండేదానివాయే.
సావిత్రమ్మ: మరదే పులిని జూసి నక్క వాత పెట్టుకోవడమంటే
లచ్చమ్మ: అల్లుడిది పెద్దుద్యోగం కందా.. వాళ్ళ ఆఫీసోళ్ళతో ఎల్లినప్పుడు ఎసుకోనుంటాది
అంజయ్య: అదేలే అప్పుడప్పుడు ఏదో అవసరానికి ఎసుకోవచ్చుకానీ ...అయిందానికీ కానిదానికీ అట్టాంటివి వాడకూడదు. అప్పటికి బాగానే అనిపిచ్చినా ... వంటికి మంచివి కాదు. సరేలే.. భూమి తల్లీ నువ్వెళ్ళి రా ..పొద్దు గుంకుతాంది.
లచ్చమ్మ: బుజ్జమ్మ వచ్చిన కాడ్నుంచి చూస్తుండా ...పైకి డాబుగా తిరుగుతున్నా మొఖంలో కళే లేదు.
సావిత్రమ్మ: విరిగిన కత్తి కమ్మరింటికి - మనువు చెడితే పుట్టినింటికి , అల్లుడిమీద అలిగొచ్చినట్టున్నాది ...యవ్వారం చూస్తే...ఇక్కడ సాన్నాళ్ళే ఉండేలాగ ఉంది..
లచ్చమ్మ: పోనీలే అత్తమ్మా ..అట్టాగైనా భూమి మన కాడ కొన్ని దినాలుంటే కాస్త దాని ఆరోగ్యం మళ్ళీ కుదురుకుంటాది...ఏదైనా చిన్న చిన్న గొడవలుంటే మెల్లిగా అల్లుడుకి నచ్చ చెప్పచ్చులే
సావిత్రమ్మ: అదీ నిజమేలే ..ఇదివరకు రోజుల్లో కూడా..పురుడనీ పున్నెమనీ పుట్టింటికి వచ్చి ..కాస్తంత బలం పుంజుకుని ..మళ్ళీ కాపరానికి పోయే టోళ్ళు * * * *
అంజయ్య: అమ్మా భూమీ .. పేరంటం బాగా జరిగినాదా.. మీ స్నేహితురాల్లను కలిసినావా..
భూమి: అందురూ కలిసినారు గానీ జ్యోతి మాత్రం కలవలే. వాళ్ళయనకు డిల్లీ బదిలీ అయ్యిందంట. వాళ్ళమ్మ చెప్పినాది. పాపం పెద్దమ్మని చూస్తే జాలేసినాది నాయనా. కొడుకులెవ్వరు ఆమెను సరిగా చూడటం లేదంట. ఆమె ఆలనా పాలనా చూసే వాళ్ళు లేరు. రోగమొస్తే బాగుచేసే వారు అంత కన్నా లేరు. పైపెచ్చు ఆ మిగిలిన మూడెకరాలూ కూడా అమ్మేసి డబ్బులిచ్చేయమంటున్నారంట.
సావిత్రమ్మ: కలి కాలం… తల్లి నుంచి తీసుకునే వారే కానీ ఆ తల్లికి తిరిగి ఇచ్చే వారు లేరు ఈ కాలంలో ...అందరికీ డబ్బు.. దయ్యం పట్టినాది.. ఒక్క డబ్బేనా.. ఎప్పటికీ ఉండే సంబంధ బంధాలు కూడా వద్దూ.. అయినా ఉన్న నాలుగు ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పుడే వాడేసుకుంటే పుట్టబోయే మనుమలు ఏమి తింటారు.. వీల్లనేమి చూస్తారు..
లచ్చమ్మ: వాళ్ళు మాత్రం ఏం చేస్తారత్తమ్మా .. వాళ్ళ చదువులూ.. వాళ్ళ కొలువులూ.. వాళ్ళ పనులు వాళ్ళవి..
సావిత్రమ్మ: ఆ.. ఎన్ని పనులుంటే మాత్రం కన్నతల్లినీ, నేలతల్లినీ అలక్ష్యం చేసి బాగుపడేటోడే లేడు..ఆ..
అంజయ్య: అవునే అమ్మా.. నేను తల్లిని చూసుకుంటున్నాగానీ ..నువ్వు చెప్పినట్టు నేలతల్లి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదే.. మన భూమి తల్లి పెళ్ళికి చేసిన అప్పుతీర్చాలన్న తాపత్రయంతో పంట తర్వాత పంట యేస్తున్నా, ఎరువులేస్తున్నా, మందుకొడుతున్నా ..ఫలితం మాత్రం సున్నా.. ఇట్టాగే యేసుకుంటూ పొతే అప్పు తీరడం కాదు కానీ ..ఈ పెట్టిన పెట్టుబడికి ..కొత్త అప్పులయ్యేటట్లున్నాది.
సావిత్రమ్మ: నిజమేరా అబ్బాయ్ నా మాటిని ఈ సారి ఏ పంట జోలికీ పోమాకు. చేనును బీడుగానే అట్టిపెట్టేయ్. అప్పుడే భూమికి సత్తువోస్తాది..
అంజయ్య: సరే అట్టాగే సేద్దాం..
భూమి: అవును నాయనా ఎక్కువ దిగుబడి సాధించాలన్న ప్రయత్నంలో మనం తక్కువ కాల పరిమితి కల సంకర జాతి వంగడాలనూ, ఎకరానికి 2 -3 పంటల్నీ పండిస్తున్నాం. అయితే సాధారణంగా అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు భూమి నుండి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన నేలకు ఆయా పంటలకు కావలసిన పోషకాలను సరఫరా చేసే సామర్ధ్యం క్రమేసి తగ్గిపోయి పోషక పదార్ధ లోపాలు తలెత్తుతున్నాయి.
అంజయ్య: అందుకేనేమో మనకి దిగుబడి సరిగా రావట్లేదు .. ముందు మన భూమిని బాగుచేసుకోవాలి...
భూమి: అయితే ఈ సీజను మన పొలానికీ నాకూ కూడా విశ్రాంతే
సావిత్రమ్మ: మనిషన్నాక కాస్తంత విశ్రాంతి ఉండాల... అయినా మనిషికీ మన్నుకీ తేడా ఏటుందీ
---------------------------------------------
రాఘవయ్య: అంజయ్యా .. అంజయ్యా ... బాగుండావా ..మన బుజ్జమ్మ వచ్చినాదంటకదా. ఎల్లమ్మ చెప్పినాది. సూసిపోదామని వచ్చా
అంజయ్య: రాఘవయ్యా.. రా ..రా.. ఇట్టా కూర్చో.. మంచి ఎండన పడి వచ్చినావ్...అమ్మా భూమీ ..రాఘవయ్య మామకు కాసింత మజ్జిగ తీసుకు రా..
రాఘవయ్య: ఈ ఎండదేముందిలే అంజయ్యా మనం యెవసాయదారులం ..ఈ ఎండకే…బెదిరిపోతామా…పోయిన ఎండా కాలం పడ్డ శ్రమకి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. యేసంకాలంలో భూమి ఖాళీగా ఉంటది కదా లోతుగా ట్రాక్టరుతో దున్నించా.
సావిత్రమ్మ: ఎవరూ రాఘవయ్యా.. బాగుండావా ..ఏమిటీ ట్రాక్టరు..దున్నడం అంటున్నావు..
రాఘవయ్య: ఏం లేదు పెద్దమ్మా భూమిని బాగా గుల్లగా దున్నితే ...నీరు బాగా ఇంకుతుంది కదా..అదీ చెప్తున్నా
సావిత్రమ్మ: ఇందులో కొత్తేముందీ దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ ఉంటే నీళ్ళు అనే సామెత ఉండనే ఉంది కదా.
రాఘవయ్య: మట్టి నమూనాలు కూడా తీసి పంపించా .. ఆ ఫలితాల బట్టే ఆ పరీక్షా కేంద్రం వారు చెప్పిన మోతాదులో ఎరువులను వేసా. దీనివల్ల మంచేమిటంటే కేవలం అవసరమైన మేరకే ఎరువులను వాడతామన్నమాట. అంతేకాక ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేతికందిన ఎరువును బస్తాలు బస్తాలు ఎయ్యకుండా, మన భూమి సంగతేంటో సరిగ్గా తెలుసుకుని మరీ ఏస్తాం. అసలు మన మట్టి ఎలాటిది.. ఏదైనా.. ఎక్కువైనాదా…లేక మరేదైనా తక్కువైనాదా...అన్నీ ఇవరాలు తెలుస్తయంట.. ఆ పరీక్ష చేస్తే..
అంజయ్య: అంటే మన రక్త పరీక్షల్లాగానే ...
సావిత్రమ్మ: నే చెప్పలేదూ మనిషైనా మన్నైనా ఒకటేననీ..
రాఘవయ్య: అవును పెద్దమ్మా .. మన రక్త పరీక్ష రిపోర్టు లాగానే భూ ఆరోగ్య కార్డు అని ఉంటది..
భూమి: బాగున్నారా మామయ్యా... మజ్జిగ తీసుకోండి మామయ్యా
రాఘవయ్య: ఆ..ఆ..బాగుండావా భూమి తల్లీ... రా..కూర్చో ..నీ గురించే మాట్లాడుకుంటున్నాం..
భూమి: నా గురించా..
రాఘవయ్య: నీ గురించి అంటే ..అచ్చంగా నీ గురించి కాదనుకో.. పొతే మన భూమి గురించీ, భూసారం గురించీ..
ఇదుగో ఇది భూ పరీక్షలు జరపడానికి నమూనాలను ఎలా తియ్యాలో చెప్పే కర పత్రం.. ఓ సారి దీని గురించి మన స్కూల్లో పిల్లలకు చెప్పు...ఎప్పుడూ పుస్తకాల్లో చదువే కాదు .. కాస్త పొలాల గురించి కూడా తెలుసుకోవాలిగా..
భూమి: అవునవును... ఇదీ వాళ్ళకో సైన్సు పాఠం లా ఉంటుంది.. సరదాగానే సేకరిస్తారులే ఈ నమూనాలను…
రాఘవయ్య: నువ్వైతే ఇలా సరదాగా చెప్తావు... నువ్వెళ్ళే లోపు ఓసారి వాళ్లకు ఈ భూసార పరీక్షల గురించీ, వాటి అవసరం గురించీ, నమూనాలు ఎలా సేకరించాలి, ఈ మట్టి నమూనాల సేకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటీ అన్న విషయాలు మన పిల్లలకూ, రైతులకూ కూడా ఓసారి చెప్పు తల్లీ
భూమి: అట్టాగే పెద్దనాన్నా ..నువ్వంతగా చెప్తే నే కాదంటానా ...ఇంకా ఉంటాలే...ఇక్కడే ..సరే వస్తా పెదనాన్నా ఆమ్మకి వంటింట్లో సాయం చేస్తున్నా…
---------
రాఘవయ్య: అంజయ్యా ...అదేంటీ అమ్మాయ్ అదో రకంగా ఉంది.. కొంప తీసి ..అత్తోరితో పోట్లాడి కానీ వచ్చేయలేదు కదా...ఇదుగో నేను సేప్తున్నననీ ఏమీ అనుకోబాక .. ఎక్కడుండే వాళ్ళు అక్కడుండాల...
అంజయ్య: అదేం లేదు గానీ .. . అమ్మాయికి ఒంట్లో కొద్దిగా తేడా వచ్చినాది.. అదేదో అయోడిన్ అంట.. . దాని లోపం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తింటాదంట. అందుకే కొద్ది దినాలు అమ్మాయిని మా కాడుంచుకుంటే మంచిదని..
రాఘవయ్య: అట్టైతే సరేలే అంజయ్యా ...ఒక ఇద్దరు పిల్లలు పుట్టాక మనకి అంత భయముండదు...ఒంటరి కాపరాలంటే ఇడిపోయే ప్రమాదం ఎక్కువ. ఇప్పుడు చూడు మన భూమి చెట్లతో, పొదలతో నిండి ఉన్నప్పుడు మనకు నేలకోత భయం ఉండదు.
అంజయ్య: నేలకోత అంటే ఏమిటి రాఘవయ్యా
రాఘవయ్య: నేలకోత అంటే ఏటంటే ... నేల అణువులు ఏదైనా కారణం వలన తమ స్వస్థానాల నుండి విడివడి పోయి వేరే చోటుకు కదిలిపోతే కోత ఏర్పడుతుంది. వాన చినుకులు నేలను తాకినప్పుడు భూఅణువులు నేల నుండి విడిపోయి పారే నీటిలో కొట్టుకు పోతాయి. ప్రవాహ మార్గంలో రాళ్ళ వంటివి లేకపోతే కోత మరింత అధికంగా ఉంటాది. వాన నీరు భూమి లోనికి ఇంకదు. భూమి పైనుంచి ఏ(వే)గంగా ప్రవహించి ఎ(వె)ల్లి పోతుంది. అలా చిన్న చిన్న కాలవల్లాగా ప్రవహి స్తూంటే కొన్ని రోజులకి నేలపై బొరియలు ఏర్పడతాయి. దీన్నే నేలకోత అంటారు. ఇలా నేలలోని సారవంతమైన అణువులు నదులలోకి, ఆకాడ్నుంచి సముద్రంలోకి కొట్టుకు పోతాయ్. అయితే పల్లం వైపు నీరు మరింత వేగంగా ప్రవహించడం వలన బొరియలు మరీ లోతుగా ఏర్పడతాయి
సావిత్రమ్మ: ఈ కధంతా సెప్పకపోయినా మన పెద్దోళ్ళు పల్లము దున్నిన వాడు పల్లకి ఎక్కుతాడు అని ఒక్క ముక్కలో చెప్పేశారు
రాఘవయ్య: మా సామెతల పెద్దమ్మ మాటకొక సామెత సెప్తాది
సావిత్రమ్మ: మాటకొక సామెత కాదు రాఘవయ్యా మాటకు మూడు నాలుగు చెప్తా ..సామెతలు..ఆ..
భూమి: నాయనమ్మా ఏదీ సూద్దాం దుక్కి మీద ఇంకో సామెత చెప్పు
సావిత్రమ్మ: నా మనమరాలికి కూడా సామెతలంటే ఇట్టవే. నా సామెతినగానే వంటింటిలోంచి వచ్చేసినాది. ఇంకో సామెత
సెప్పలేననుకున్నావా … ఇనుకో …దుక్కి లేని చేను తాలింపు లేని కూర; నాగలి ఉన్న వారిలో ఆకలి చేరదు, పేడ ఎరువు కంటే పిండి దుక్కు మేలు, చాలు పై చాలు దున్నితే చచ్చు నేలైనా పండుద్ది..
నాయనమ్మా నేను కూడా చెప్తా..వేసంగి భూమిని దున్నితే కాసులు ఇస్తుంది
సావిత్రమ్మ: ఈ సామెతెప్పుడూ ఇనలేదే ...నువ్వే కట్టుంటావ్ ..
రాఘవయ్య: పాతదైనా కొత్త దైనా సామెతలాగుంటే అది మనకు బాగా గుర్తుండి పోతుంది కదూ…
అంజయ్య: ఎహే …ఆపండర్రా మీ సామెతలు..మద్దిలోను.. ….అయితే వాన నీటి వల్ల కూడా ఇంత నష్టం ఉందన్న మాట …
రాఘవయ్య: ఒక్క నీటి వల్లే కాదు ..ఏగంగా వీచే గాలి కూడా పెమాదమే. ఈ గాలి తేలికగా ఉన్న నేల అణువులను ఎగరగొట్ట గలదు. ఈ నేలకోత అరికట్టడానికి సాధ్యమైనంత ఎక్కువగా నేలపై పచ్చదనం పైపొరను ఏర్పరచి వర్షాకాలంలో మల్చింగ్ చేయడం … అంటే..నేల మీద ఆకులూ అలాలూ లాంటివి కప్పడం వల్ల కూడా సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా కాపాడ వచ్చు.
వాలు ఎక్కువ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా దున్నటం, వాలుకు అడ్డంగానే విత్తనాలు వేయడం, వాలుకు అడ్డంగానే అంతర కృషి చేయడం చేయాలి. కాంటూరు గట్లు నిర్మించాలి. లేకుంటే వట్టి వేరు లాంటి గడ్డి మొక్కలతో జీవ గట్లు పెంచాలి.
నీటి పెవాహం జోరుగా ఉంటే నట్టం ఎక్కువగా ఉంటాది. కనుక నీటి ప్రవాహ మార్గంలో ఎక్కువ నీటిని గ్రహించే మొక్కలను నాటడం వలన నీటి జోరు తగ్గడమే కాకుండా మరింత ఎక్కువగా నీరు భూమిలోకి పీల్చుకోబడేటట్లు చేయవచ్చు. గాలి వేగాన్ని తగ్గించడానికి గాలి వాలుకు అడ్డంగా కూడా వరుసలలో చెట్లను పెంచాలి.
సావిత్రమ్మ: అందుకే చెట్లుంటే క్షేమం - లేకుంటే క్షామం అన్నారు
రాఘవయ్య: సరే అంజయ్యా ఇంక నే వస్తా..పెద్దమ్మా ఎల్లొస్తా.. అమ్మా భూమీ రేపో మాపో ఓసారి ఇంటికిరా
----------------------------------------------------
భూమి: అత్తా ...ఎల్లమ్మత్తా
ఎల్లమ్మ: ఎవరూ భూమీ.. రా రా.. నాయనమ్మ అమ్మా బాగుండారా..
భూమి: ఆ. బానే ఉన్నారు.. అవునూ రాఘవయ్య మామ ఏరీ ..
ఎల్లమ్మ: సొసైటీలో ఎరువులేవో ఇస్తున్నారు.. ఆడికి పోయినారు..ఎరువులకి మంచి గిరాకీ కదా.
భూమి: అవును మరి. అందుకే ఎరువులేని పైరు - పరువులేని రైతు అంటారు
ఎల్లమ్మ: సామెతల పెద్దమ్మ మనుమరాలనిపించు కున్నావ్. అవునే భూమీ, నాకు తెలియక అడుగుతాను.. ఇప్పుడెందుకే అందరూ ఎరువులో అని ఎగబడతరు.. ఇంతకు ముందు ఈ ఎరువులున్నాయా ఏంది. మరి అప్పుటోల్లంతా ఏంచేసినారంటావ్
భూమి: కేవలం ఐదు దశాబ్దాల నుండి మాత్రమె మనం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాం . అయితే వీటిని ఎలా పడితే అలా వాడడం వలన రసాయన మూలకాలు అవశేషాలుగా మిగిలి పోయి చివరికి తల్లి పాలలో కూడా చేరిపోయాయి. కాబట్టి రాసాయానికి ఎరువుల వాడకాన్ని కొంత తగ్గించి వాటి స్థానంలో సేంద్రీయ ఎరువులను వాడాలి.
ఎల్లమ్మ: సేంద్రీయ ఎరువులంటే ఏందే భూమీ
భూమి: సేంద్రీయ ఎరువులు అంటే జంతువులు మానవులు విసర్జించిన పదార్ధాలు, ఆకులు, వృక్ష సంబంధ పదార్ధాలతో ఏర్పడిన దాన్ని సేంద్రీయ పదార్ధం అంటారు. ఇది నేలకు జీవం వంటిది.
ఎల్లమ్మ: అవునా..అదెట్టాగా?
భూమి: సేంద్రీయ పదార్ధం మొక్కలకు నత్రజని, భాస్వరం, పోటాష్ లు అందిస్తుంది. వీటితో బాటు కాల్షియం, మెగ్నీషియం గంధకం వంటి సూక్ష్మ పోషకాలకు భూమిలో మార్పిడి చేసుకునే శక్తిని పెంచి, పోషకాలను నేలలోనే పట్టి ఉంచుతుంది. నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి కూడా పెరుగుతుంది. నేలగుల్లబారి మొక్కల వేళ్ళు బాగా చొచ్చుకొని పోతాయి. ఆమ్లత్వం తగ్గుతుంది. సూక్ష్మ జీవుల క్రియలను ప్రోత్సహించి, సూక్ష్మ జీవుల మధ్య సయోధ్యను పెంచుతాయి.
ఎల్లమ్మ: మరి అంత మంచివైతే మనమూ అయ్యే వేసేయచ్చు కదా..
భూమి: మనమూ వేస్తూనే ఉన్నాం అత్తా ...పశువుల పెంట కూడా సేంద్రీయ ఎరువే. కాకపొతే మనం వాటి అవసరాన్ని అంతగా గుర్తించటం లేదు. పెంట కుప్ప పెరిగితే పేద రైతు పెద్దవాడవుతాడు అని మన పెద్దోళ్ళు చెప్పినా ఏదో పాత కాలం సామెతలే అని కొట్టి పదేస్తున్నాం.
రాఘవయ్య: మరి ఇప్పుడంత పశువుల పెంట యాడ్నుంచి తెవాల? రసాయనిక ఎరువులైతే …కొంటే దొరుకుతాయి.
భూమి: శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఇప్పుడు ఇవి కూడా మార్కెట్లలో దొరుకుతున్నాయి మామా...
ఎల్లమ్మ: పశువుల పెంటకేం భాగ్గెం? పాడి ఉంటే పెంట అదే వస్తది.
భూమి: అవును అత్తా.. ముందరి రోజుల్లో ఇలా..ఒక్క పంటో రెండు పంటలో ఏసేటోళ్ళు కాదు. అన్ని రకాలూ పండించేటోళ్ళు ..ఒకదానిలో మిగిలినది మరొకదానికి ఉపయోగపడేది. అందుకే పంట పెంటలో ఉంది - పాడి పూరోలో ఉంది
రాఘవయ్య: అవునే భూమీ, మా సిన్నప్పుడు కొంత పాడి, కొన్ని కోళ్ళు, కొంత వరి, గట్ల మీద కంది, వరి పంట తీసేసాక పెసర, మినుము, చెట్లు, పాదులు అబ్బో...ఎన్ని కూరగాయలు...ఎన్ని రకాల పళ్ళు...సంవత్సరం పొడవునా యాదో ఒకటి కాస్తానే ఉండేది...మేము తింటానే ఉండేవాళ్ళం. .. ఆ రోజులే వేరు.
ఎల్లమ్మ: మళ్ళీ ఆ రోజులొత్తాయంటావా ?
భూమి: రావాలి అత్తా. అవి రావు. మనమే తీసుకురావాల. అట్టా తీసుకువస్తేనే మన భూమికీ మనకూ ఆరోగ్యం. మీరు అనుభవించిన ఆ కాలం .. మీ మనుమలూ, ముని మనుమలూ కూడా చూడాలి అత్తా..కాదంటావా…
ఎల్లమ్మ: అవునే భూమీ, ఆ కాయి..ఆ కసరు, ఆ మట్టి వాసన...అన్నీ తిరిగిరావాల.. అదే నిజమైన ఐశ్వర్యం.
రాఘవయ్య: సరే..సరే.. కబుర్లు.. బాగానే ఉన్నాయ్. అమ్మయికేదైనా తింటానికి పెట్టావా.. పోయి పని చూసుకో..
ఉ..ఉ.. అంతేలే.. మాకెంతసేపు వంటపని.. ఇంటి పనే.. పొలం మీద మా పెత్తనం ఏటైనా ఉందేటి? మా పెత్తనమైతేనా.. పెట్టుబడి..లాభాలు..మాటేమీటోగానీ , కాయీ కసరూ, పాలూ పండూ కి లోటు ఉండేది కాదు… ఆ..
రాఘవయ్య: దాని మాటలకేం గానీ, నువ్వు చెప్పు తల్లీ. ఇంకా ఏవో సేంద్రీయ ఎరువులున్నయన్నావు కదా...ఏందవి
భూమి: అవి చాలా వరకూ మనకు తెలిసినవే మామా.. నూనె చెక్కలు, పచ్చి రొట్ట పైర్లు… పిల్లి పెసర, జనుము, జీలుగ వంటి పచ్చి రొట్ట పైర్లు పండించడం ద్వారా, పచ్చి రొట్ట ఆకును పంట పొలాల్లో వర్షాలు పడే ముందు కలియడున్నడం వల్ల కూడా నేలకు తగినంత సేంద్రీయ పదార్ధం సమకూరుతుంది.
ఇంకా గొర్రెల పెంట, కోడి పెంట… పశువుల పెంట...అందుకే.. పెంట కుప్ప పెరిగితే పేద రైతు పెద్దవాడవుతాడు అంటారు. అబ్బో ఒకటేమిటి ఇంకా ఏవో చాలా రకాలు ఉన్నాయి.. చేపల ఎరువు, ఫిల్టరు మడ్డి…
ఎల్లమ్మ: ఆవు పేడ కూడా శానా మంచిదంటగా
భూమి: ఒక్క ఆవు పేడే కాదత్తా మూత్రాన్ని కూడా ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఆవు మూత్రం సాధారణంగా వృధాగా పోతుంది. అలా వృధాగా పోకుండా అక్కడ ఒక తొట్టి కట్టాలి. ఆ తొట్టిలో ప్రతిరోజూ ఉదయం మట్టిని వేసి మరునాడు ఉదయం దానిని తీసివేయాలి. ఈ విధంగా తీసిన మట్టిని మొక్కకు ఒక తట్ట చొప్పున వేస్తె భూమికి మంచిది.
ఎల్లమ్మ: అట్టాగా! ఆవు పేడకి, ఆవు మూత్రానికి అంత ఇలువన్న మాట!
భూమి: మరి అందుకేగా.. అమెరికావాళ్ళు మన గోమూత్రం పై పేటెంటు హక్కులు సొంతం చేసుకున్నారు..
ఎల్లమ్మ: ఏందీ …పేషంటు హక్కా..
భూమి: పేషంటు కాదత్తా ..పేటెంటు.. ఆవు మూత్రం పై పేటెంటు..
రాఘవయ్య: సరే దాని కథ ఇంకో పాలి చెప్పుకుందాం కానీ ముందు ఈ ఎరువుల కథ ఇందాం. నువ్వు సెప్పు బుజ్జమ్మా.
భూమి: అ.. ఆవు మూత్రం అంటే గుర్తోచ్చినాది..పంచ గవ్య..అనీ..
ఎల్లమ్మ: ఏందీ..పంచామృతాలా...
రాఘవయ్య: ఛీ..ఛీ..పంచ గవ్యాలంటే పంచామృతాలంటావ్ ...
భూమి: ఒక రకంగా..అలాటిదేలే..పంచామృతంలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి లాంటి తీపి వస్తువులు కలుపుతారు.. ఈ పంచగవ్యలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు మూత్రం ఉంటాయి. వీటికి తోడు చెరకు రసం, కొబ్బరి నీళ్ళు, బాగా పండిన అరటి పండ్లు కూడా కలుపుతుంటారు. ఒక్కో సారి కల్లు, బెల్లం కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొన్ని రోజులు ఉంచి నేరుగా భూమికి కానీ, పలుచన చేసి పంటల మీద కానీ చల్లితే భూమి, మొక్కలు కూడా తిరిగి బలం పుంజు కుంటాయి.
రాఘవయ్య: మరి నువ్వు సెప్పినట్టు ఈ ఆవు పేడ, ఆవు మూత్రం యేస్తే ఎట్టాంటి భూమైనా సరే బంగారం పండిస్తదంటావా?
భూమి: అంటే మామా ఇది టానిక్కు లాంటిదనుకో. కానీ కొన్ని భూములకు కొన్నికొన్ని సమస్యలుంటాయి. అట్టాంటప్పుడు మనం ముందుగా వాటిని బాగుచేసుకోవాల.
ఎల్లమ్మ: భూములకు కూడా సమస్యలా...మనకే సమస్యలున్నాయనుకున్నాను..
భూమి: ఒక రకంగా భూముల సమస్య కూడా మన సమస్యే ..మన భూములను బాగు చేసుకుంటే మనమే బాగు పడతాం.
రాఘవయ్య: బుజ్జమ్మా ఇప్పుడు భూమిని చదునుగా కాక బోదెలు, కాలవలు లాగ సేయమంటున్నారు ఎందుకంటావ్?
భూమి: అది..మామా..నేల లోతు తక్కువగా ఉన్నప్పుడు అలా బోదెలుగా చేసి వాటి మీద పైరును నాటితే మంచిదంట. అయితే ఈ బోదెలు, కాలువలు భూమి వాలుకి అడ్డంగా చేయాలంట. . అదే నేలలో ఇసుక శాతం ఎక్కువ ఉందనుకో, వేసవిలో వర్షాలకు ముందే చెరువు మట్టిని తెచ్చి చేను మొత్తం పలచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఆ తర్వాత 200 కిలోల బరువు గల రోలర్ ను 5 -6 సార్లు నడిపించాలి. ఇలా చెరువు మట్టి వేయడం వలన భూమిలో బంక మన్ను శాతం పెరుగుతుంది.
ఎల్లమ్మ: అంటే మన్నుకు మన్నే మందన్న మాట. ఇసుక నేల దున్ని బాగుపడడు బంక నేల దున్ని చెడడు అని వదిలేయకుండా ఇట్టా చేస్తే మంచిదే
భూమి: సరిగ్గా చెప్పావు అత్తా..అందుకే అంటారు ఒకరకం నేల మరొక రకం నేలకు ఎరువని
రాఘవయ్య: బుజ్జమ్మా ... అంత బరువు రోలర్ను భూమి మీద దోర్లిస్తే నేల గట్టిపడి పోతుంది కదా..మరి భూమి గట్టిపడి పోవడం కూడా ఒక సమస్యే గాదేటి?
భూమి: ఇలా ఇసుక ఎక్కువగా ఉన్న నేలలకు అదే వైద్యం కానీ.. కొన్ని నేలల్లో అది నువ్వన్నట్టు పెద్ద సమస్యే .
ఎల్లమ్మ: మన నేలలో ఆ సమస్య ఉన్నదీ లేనిదీ మనకేట్టా తెలుసుద్ది?
భూమి: ఈ సమస్యను మనం తేలికగానే గుర్తించవచ్చు.
ఒక మీటరు వెడల్పు, పొడవు, లోతు గల గోయ్యిని తవ్వి చూస్తె భూమిలోపల గట్టి పొర కనబడుతుంది. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్న పాటి చాకును గుచ్చి ఈ గట్టి పొర ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చును. పెద్ద ట్రాక్టరుతో లోతుగా దున్నే నాగళ్ళతో దున్ని ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ లోతు చాళ్ళను 60 సెంటీ మీటర్ల దూరంలో రెండు వైపులా తోలాలి. దీనితో బాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం వేస్తే కూడా మంచిది. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇటువంటి నేలల్లో ఎకరాకు 2 టన్నుల వరి పొట్టు గానీ లేక దంచిన వేరుశనగ పొట్టును గానీ పొలంపై చల్లి , పై పొరలో బాగా కలిసేలా దున్నాలి.
రాఘవయ్య: నువ్విట్టంటున్నావ్ కానీ బుజ్జమ్మా ఇప్పుడు కొంతమంది అసలు నేలను దున్ననే వద్దంటున్నారు.
భూమి: జీరో టిల్లేజ్ అనీ ..ఆ పద్ధతి కూడా ఉందనుకో ... అది ..ఆ యా పరిస్థితి బట్టి ఉంటుంది.
ఎల్లమ్మ: అంతేలే …పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఉండదుగా…మరి చౌడు భూములనెట్టా బాగు సేయ్యాల..
రాఘవయ్య: ఈ సౌడు భూముల సంగతి నాకెరికేలే ..అందిట్లో పాల చౌడనీ, కారు చౌడనీ ఉంటాయి..పాల చౌడంటే ఏసం కాలంలో నేలపైన తెల్లగా అగుపిస్తుంది. ఈ పేరుకొన్న చౌడును పారతో చెక్కి తీసి వేయాలి. పొలాన్ని చిన్న మడులుగా చేయాలి. ప్రతి మడిలో షుమారు 20 సెం. మీ. లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగు నీటిని పెట్టాలి. ఈ నీటిని మడిలో 4 లేక 5 రోజులు నిలువ ఉంచి ఇంకనీయాలి. తర్వాత మురుగు నీరు కాలువలద్వారా తీసివేయాలి. ఈ విధంగా ౩-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
భూమి: మరి మామా, కారు చౌడును ఎట్టా బాగు చెయ్యాలి?
రాఘవయ్య: అదీ ఇట్టాగే ...కాకుంటే ఈ నేలల్లో నీరు ఇంకే గుణం తక్కువగా ఉంటాది. అందుకే మళ్ళ నుండి మురుగు నీరు పోయేలాగా మురుగు నీటి కాలవలు చేసుకోవాలి.
ఎల్లమ్మ: కారు చౌడంటే, భూమి మీద పొర నల్లగా ఉంటాదా?
రాఘవయ్య: అ.. బాగానే సెప్పావ్.. అయితే ఈ భూమిలో మనం జిప్సం ఎసుకోవాల. ఒకవేళ నేలలో సున్నం కనుక ఎక్కువుంటే పొడి చేసిన గంధకాన్ని వాడుకోవాల. తెల్లచౌడు ఒక మోస్తరుగా ఉంటే జీలుగను పెంచి మట్టిలో కలియ దున్నాలి. అట్టాగే ఆ నేల స్వభావాన్ని తెలుసుకుని దానికి ఏమెయ్యాలో తెలుసుకుని బాగు చేసుకోవాల.
భూమి: మామా.. భూమిని బాగు చెయ్యాలంటే అన్నీ ఏసేడమే కాదు.. కొన్నిటి ని తీసేయాలి కూడా..
రాఘవయ్య: ఓహో ..అట్టాగా...
భూమి: ఇప్పుడంతా కాలుష్యమయం కదా.. ఆ కాలుష్యం భూమికి కూడా పట్టుకున్నాది.. మరి దాన్ని వదిలించద్దూ
రాఘవయ్య: అ..వదిలించద్దూ మరీ.
భూమి: అందుకే కొన్ని రకాల చెట్లను, మొక్కలను పెంచి నెలలోని విషపూరిత కాలుష్య కారకాలను భూమిలోపలి నుండి బయటకు తెచ్చేయాలి. ఇలా చేయడాన్ని చేయడాన్ని ఫైటోరేమిదిఎషన్ అంటారు. ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న శాస్త్ర విజ్ఞానం. రాబోయే కాలంలో ఇది ఒక పరిశ్రమగా అవ్వచ్చంట. మా ఆయన వాల్లాఫీసులో దీని గురించే పరిశోధనలు చేస్తున్నారంట. అందుకే నాకూ తెలిసినదనుకో. ఈ మొక్కలు నేలలోని లోహాలను రవాణా చేసి తేలికగా కోయడానికి వీలుండే వేళ్ళు, కాండాలలో జమ చేస్తాయి. కొన్ని రకాల మొక్కలు కొన్ని ఆవిరి కాగల రసాయనాలను తొలగిస్తాయంట. ఆవమొక్కలుంటాయే అవి...అదేందీ .. అ..సిలీనియం ను ఇట్లా తొలగిస్తాయంట. మరొక పద్ధతిలో విషలోహాలు తొలగింపబడవు కానీ వాటి విషప్రభావం తక్కువ చేయ బడుతుంది.
రాఘవయ్య: అయితే మన భూమిని బాగు చెయ్యడానికి ఇన్ని రకాల కొత్తకొత్త పద్ధతులొస్తున్నాయన్నమాట.
ఎల్లమ్మ: ఆ భూమి గురించి అంతగా పట్టించుకునేఓడు మన భూమి తల్లిని పట్టించుకోట్లే దేంటి.

భూమి: సరే మామా ..అమ్మ కాసుకో నుంటాది .. ఎల్లొస్తా...అత్తా .. రేపు మన స్కూలు కాడ.. ఆఫీసోళ్ళు ఎవరో జీవన ఎరువుల గురించి చెప్తారంట. మర్చిపోకుండా తొందరగొచ్చేయ్.
• * * * * *
ఎల్లమ్మ: లచ్చమ్మా.. లచ్చమ్మా..
లచ్చమ్మ: రా ...రా ...ఎల్లమ్మా ..బాగున్నావా..
ఎల్లమ్మ: అ..బాగానే ఉన్నా గానీ..భోజనాలైనాయా..
సావిత్రమ్మ: అయినాయ్ గానీ..ఏదో పని మీదొచ్చినట్లున్నావ్...నువ్వూరికే రావు కదా..మా ఇంటికి.
ఎల్లమ్మ: అ..సావిత్రమ్మా బాగుండావా... ఏవో జీవన ఎరువులంట.. దాని గురించి చెప్తారు.. రమ్మంది ..మన భూమి.. కానీ నాకే తీరలేదు ..
సావిత్రమ్మ: మన భూమి ఎల్లిందిలే...ఇదుగో..నేనూ పోయొచ్చా ...రాకపోతే నా మనుమరాలు ఊరుకుంటుందా..
ఎల్లమ్మ: నువ్వు పోలేదా లచ్చమ్మా
లచ్చమ్మ: నాకెక్కడ కుదుర్తాది? అయినా ఈల్లిద్దరూ పోయినారంటే ..మనకు చూసింది చూసినట్లు చెప్తారు.
సావిత్రమ్మ: అదేం లేదులే ఎల్లమ్మా ..ఆ..వానపాము ఎరువు మనకు తెలిసున్నాదే కదా ..ముందు దాని గురించి చెప్పినారు.. ఆ తర్వాత ఇంక ఏవో స్సూచ్మ జీవులంట ..వాటి గురించి చెప్పినారు. అప్పుడర్ధమైనట్లే ఉంది గానీ.. ఆ పేర్లు చెప్పనీకి నాకు రాదే .. మన భూమిని రానీ..
అంజయ్య: ఎల్లమ్మత్తా..బాగుండావా..నేనూ ఎల్లానులే మీటింగుకి.. పాపం పని పాటా మనుకోనోచ్చినావు ...నేను సెప్తా గానీ ..
ఎల్లమ్మ: నువ్వు చెప్తే మంచిదే గదా అంజయ్యా
అంజయ్య: అదేందంటే అత్తమ్మా ..జీవన ఎరువులంటే సూక్ష్మ జీవుల కణాలు. ఇవి కోట్లాది సంఖ్యలో ఉంటాయి. నేలకు వేసినప్పుడు వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందులో చాలా రకాలుంటాయనుకో. బాక్టీరియా అనీ, శిలీంద్రాలు అనీ. మల్లేమో నాచు ఉంటాదే అది కూడా జీవన ఎరువే. ఇవి విడి విడిగా కానీ కలిసి గానీ భూమికి ఎరువుగా వేసుకోవచ్చు.
ఈ బాక్టీరియాల్లో కొన్ని నత్రజనిని స్థిరీకరిస్తాయి..కొన్నేమో భాస్వరాన్ని కరిగిస్తాయి. ఈ నత్ర జనిని స్థిరీకరించేవి మొక్కతో కలిసి జీవిస్తాయి. నాచు కూడా నత్రజనిని స్థిరీకరిస్తుంది. కాకపొతే ఇవి స్వతంత్రంగా జీవిస్తాయి.
సావిత్రమ్మ: అబ్బయ్యా..అదేందదీ..నీలి పచ్చ ఆకా..వరి పొలాల్లో ఎసుకోవచ్చు అన్నారు అదేంది?
అంజయ్య: నీలి ఆకు పచ్చ నాచు.. అది కూడా నాచే. ఈ నాచు ఎరువు 10 కిలోల సంచీలో లభిస్తుందంట. దీన్ని రైతులు కూడా పెంచుకోచ్చంట. సిమెంట్ తొట్టెలలో రంపం పొట్టు, బూడిద, సూపర్ ఫాస్ఫేట్ యేసి పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఏటంటే ..వీటి వలన వాతావరణ కాలుష్యం ఉండదు. నేలకు.. పంటకు ఎలాటి హాని ఉండదు.
ఎల్లమ్మ: అయితే వీటిని మిగతా ఎరువులతో బాటే యేసేయచ్చా?
అంజయ్య: లేదు.. వీటిని పురుగు మందులతో గానీ..రసాయన ఎరువులతో గానీ కలప కూడదు...
సావిత్రమ్మ: నీకు అన్ని ఇషయాలూ బాగానే గుర్తున్నాయిరా..అబ్బాయ్..
అంజయ్య: ఇవి గుర్తున్నాయే ..ఆటి పేర్లే గుర్తులేవు.. మన భూమి తల్లిని రానీ
లచ్చమ్మ: మాటల్లోనే వచ్చేసినాది మన భూమితల్లి ..నూరేల్లాయుస్సు..
అంజయ్య: అమ్మా భూమీ..ఆ జీవన ఎరువుల గురించి తెలుసుకోడానికి మన ఎల్లమ్మత్త వచ్చినాది.. యివరాలన్నీ చెప్పినా గానీ ..ఆ పేర్లే నాకు గుర్తు లేవు ...నీ కు గుర్తుండాయా
భూమి: నాకూ గుర్తులేదు నాయనా..వాళ్ళు ఆ ఇవరాలన్నీ రాసిన కాయితాలిస్తారంట. నేను పేర్లు మాత్రం రాసు కోచ్చినాను. చదవాల్నా..
అంజయ్య: చదువు..
సావిత్రమ్మ: ఇనుకుంటే..అనుకుంటే ..అవ్వే ఆలవాటౌతాయ్
భూమి: రైజోబియం ..
అంజయ్య: ఆ..రైజోబియం..ఇది చాలా సార్లు ఇన్నాలే
భూమి: అజటోబాక్టర్
సావిత్రమ్మ: అ.. అజటోబాక్టర్ .. అట్టంటిదే ఇంకోటి ఉన్నాది..ఏం దదీ
భూమి: అజోస్పిరిల్లం ..
సావిత్రమ్మ: ఆ..అజోస్పైరిల్లం
భూమి: అజోల్లా ..
సావిత్రమ్మ: అ..అజోల్లా..ఈ పేరు బాగుందే..సిన్న పేరు..
భూమి: నాయనమ్మా ..సంబర పడకు.. ఇప్పుడొచ్చేది పెద్ద పేరు..ఫాస్ఫోబాక్టీరియా ..
అంజయ్య: బాక్టీరియా..దాని ముందు ఫాస్ఫో చేరిస్తే అయిపోయే
భూమి: మైకోరైజ..
ఎల్లమ్మ: మైకోరైజ... ఆ...చాలానే ఉండాయి. అయితే అంజయ్యా ..మనం వీటి గురించి ఇంకా తెలుసుకుని ..మనం అందరమూ వీటిని వాడుకుంటే ... మనం, మన భూమి బాగుంటాం..అన్న నమ్మకం వచ్చేసినాదనుకో ...మరి నే వస్తా..
అమ్మా భూమీ ...ఇదిగో ..నీ కోసం ఈ పొడి చేసినా ...నూనె చెక్కలన్నే కలిపి చేసినా..నీ ఆరోగ్యానికి చాలా మంచిది..మామ నీకోసం చేను కాడ్నుంచి గోంగూర, తోటకూర, మునగాకు తెచ్చినాడు..అమ్మతోని కమ్మగా వండించుకుని తిను. త్వరలో మమ్మల్ని నీ సీమంతానికి పిలవాల…

రాఘవయ్య: అంజయ్యా ..అంజయ్యా ..ఇదుగో భూమి తల్లి కాడ్నుంచి ఉత్తరమొచ్చినాది ...నేను ఇటే వస్తుంటే మన పోస్టు ప్రసాదు ఇచ్చిండు.
అప్పుడు మన భూమి తల్లి చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ..మన భూమి కొత్త పెళ్లి కూతురిలా కళ కళ లాడతా ఉంది.. జల కళ కూడా బాగా ఉంది. నీళ్ళు బాగా నిలిచి ఉన్నాయ్
అంజయ్య: రాఘవయ్యా మన భూమి తల్లి నీల్లోసుకున్నాది..
సావిత్రమ్మ: శుభం ...ఇప్పుడు మా ఇంట్లో పండంటి బిడ్డ పుట్టడం ఖాయం ...
రాఘవయ్య: ఇప్పుడు మా పొలంలో పుట్టెడు పంట పండడం కూడా ఖాయం ...

No comments:

Edutainment

Edutainment
Crossword puzzles for farmers